కలం, వరంగల్ బ్యూరో: కాజీపేట (Kazipet) మండలంలో బుధవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. కడిపికొండ గ్రామంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న ఒక ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తండ్రీకూతుళ్లు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ (54) ఆయన కుమార్తె రాజశ్రీ (24) మంటలకు ఆహుతై సజీవ దహనమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.
తెల్లవారుజామున మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ విషాద ఘటన వెనుక కుటుంబ కలహాలు ఉన్నాయని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ అల్లుడే ఉద్దేశపూర్వకంగా నిప్పంటించి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇది ప్రమాదమా లేక పథకం ప్రకారం చేసిన హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

