కలం, వెబ్ డెస్క్: ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మనస్పర్థల కారణంగా భార్యతో దూరంగా ఉంటున్న ఓ భర్త.. భార్యపై బ్లేడ్తో దాడి చేశాడు. సజ్జాపురంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సజ్జాపురానికి చెందిన దిల్లేశ్వరి, గోవిందులకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. కొద్ది రోజుల పాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు తలెత్తాయి. తరచూ గొడవలు జరిగాయి. భర్త తీరుపై దిల్లేశ్వరి తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గోవిందును మందలించారు.
అయినా తన తీరు మారకపోవడంతో పోలీసుల సూచనల మేరకు కొంతకాలం నుంచి దంపతులిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. దిల్లేశ్వరి ఓ షాపులో పని చేస్తుంది. శనివారం ఆమె షాపు దగ్గరికి వచ్చిన గోవిందు తనకు ఆరోగ్యం బాగా లేదని, బండిపై తన ఇంటి వద్దకు తీసుకెళ్లాలని దిల్లేశ్వరిని కోరాడు. దీంతో దిల్లేశ్వరి భర్తను తన బండిపై ఎక్కించుకొని వెళ్తున్న క్రమంలో వెనక కూర్చున్న గోవిందు ఒక్కసారిగా బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం బండి తీసుకొని పరారయ్యాడు. స్థానికుల సహకారంతో దిల్లేశ్వరి ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

