కలం, వెబ్డెస్క్: తెలంగాణలో సర్ (Telangana SIR) ప్రక్రియ గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సర్ నమోదు ప్రక్రియను ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణలో సర్ ప్రక్రియ పొడిగించడం ఇది రెండో సారి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 3వ తేదీకి సర్ గడువు ముగియనుంది. కాగా, మొదట్లో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 14వ తేదీనే గడువు ముగిసింది. అయితే కొన్ని చోట్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం, అధికారులు, పలు రాజకీయ పార్టీలు మరింత సమయం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం సర్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో సర్ స్టేటస్ ఇదే..
రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముందు నుంచి మందకొడిగానే సాగుతోంది. అధికారులు మరోసారి గడువు పెంచే ఛాన్స్ లేదని చెప్తూనే ఉన్నారు. అయినా క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు రాలేదు. బీఎల్వోలు అస్సలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. రెండోసారి సర్ గడువు పూర్తయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం లోపే ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కూడా కొన్ని చోట్ల జరగలేదని ఫిర్యాదులు వచ్చాయి. అయితే తాజాగా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం జూలై 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77.12 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డిలో పరిస్థితి దారునంగా ఉంది. హైదరాబాద్లో కేవలం 56.31 శాతం పూర్తవగా, రంగారెడ్డిలో 63.43 శాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా 94 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే టాప్లో ఉంది. ఈ పది రోజుల్లో వంద శాతం ప్రక్రియ పూర్తవుతుందా? లేదా? అనేది వేచి చూడాలి
సర్ ప్రక్రియ పొడిగింపు!
-తెలంగాణలో సర్ ప్రక్రియ గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
-ఆగస్టు 10వ తేదీ వరకు సర్ ప్రక్రియ కొనసాగించనున్నట్లు ప్రకటించిన అధికారులు
Election Commission of India decides to extend the deadline for the SIR process in Telangana.… pic.twitter.com/6hqbK1v5v5— Kalam Daily (@kalamtelugu) July 31, 2026

