కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఫీజు రీఎంబర్స్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరవింద్ స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి జిల్లా కన్వీనర్ వేపూరి నరేందర్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ శివాజీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి వందలాది మంది విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.
రూ.8 వేల కోట్ల బకాయిలు..
ఈ సందర్భంగా అరవింద్ స్వామి మాట్లాడుతూ.. రూ.8 వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. కాలేజీలకు బకాయిలు రాకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. పాత పద్ధతిలోనే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాధనమోని వెంకటేష్, కార్యదర్శి శ్రావణ్ కుమార్, దామోదర్, వెంకటేష్ గోపి అన్నా తదితరులు పాల్గొన్నారు.

