కలం, స్పోర్ట్స్ : ఐర్లాండ్తో టీ20 సిరీస్లో ఎదురైన పరాజయం తర్వాత టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లండ్తో (England) తొలి టీ20లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), మబ్బులు కమ్ముకున్న వాతావరణం, గడ్డి ఉన్న పిచ్ ఉన్నప్పటికీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులలో కెప్టెన్లు బౌలింగ్కే మొగ్గు చూపుతారు. భారత్ నిర్ణయానికి గల కారణాన్ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్(Dinesh Karthik) వివరించారు. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన రెండు టీ20లలో లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై భారత్ వరుసగా ఓడిపోయిందని, ఆ అనుభవం కారణంగానే ఈసారి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణ పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కార్తీక్ పేర్కొన్నారు.
మ్యాచ్లో భారత్ 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దైంది. దీంతో భారత వ్యూహం ఫలించిందా లేదా అన్నది తేలకుండానే మ్యాచ్ ముగిసింది. టాస్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఐర్లాండ్ సిరీస్ ఇప్పుడు గతమైందని, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల కొత్త సిరీస్పై పూర్తి దృష్టి పెట్టామని చెప్పారు. ఐర్లాండ్ సిరీస్ నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నామని, ఇంగ్లండ్ బలాబలాలపై తమ వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. పిచ్పై గడ్డి ఉండటంతో అది ఎలా స్పందిస్తుందో ముందే ఊహించలేమని అయ్యర్ వ్యాఖ్యానించారు.

