కలం, నిర్మల్: శ్రావణ శనివారం సందర్భంగా నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి (Lakshmi Narasimha Swamy Temple) భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి, మహారాష్ట్రలోని ముంబై తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు వంటావార్పు చేసుకుని, పౌర్ణమి ఉపవాస దీక్షలను విరమించారు. దాతల సహకారంతో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో బాపురెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మాధవరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

