కలం, వెబ్ డెస్క్: అధికారిక నివాసంలో లెక్కల్లో లేని భారీగా నగదు కట్టలు లభించిన వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Varma )కు షాక్ తగిలింది. ఈ కేసులో ఆయన్ని లోక్సభ విచారణ కమిటీ దోషిగా తేల్చింది. బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. లభ్యమైన నగదుపై జస్టిస్ యశ్వంత్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తేల్చింది.
గత ఏడాది ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని స్టోర్ రూమ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో లెక్క తేలని గుట్టలు గుట్టలుగా రూ. 500 నోట్ల నగదు కట్టలు కనిపించాయనే ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. దీంతో ఆయనపై చర్యల కోసం కేంద్రం ముగ్గురు సభ్యులతో కూడిన లోక్సభ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే చట్టబద్ధంగా స్టోర్ రూమ్ సీల్ చేసి తనిఖీ చేయడానికి ముందే ఆ ప్రాంతంలోని పరిస్థితులు చెరిపివేశారని, ఆ తర్వాత ఆ నగదు ఏమైందో ఇప్పటికీ స్పష్టత లేదని లోక్సభ విచారణ కమిటీ తేల్చింది. ఇదే విషయాన్ని విచారణ కమిటీ మే నెలలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించగా.. బుధవారం ఈ నివేదికను పార్లమెంట్ వేదికగా బయటపరిచారు.
ఇదిలాఉంటే ఈ వివాదం బయటపడిన వెంటనే జస్టిస్ యశ్వంత్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అనంతరం పార్లమెంట్లో తొలగింపు ప్రక్రియ ప్రారంభం అయిన వేళ జస్టిస్ యశ్వంత్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా నోటీఫై చేయాల్సి ఉంటుంది.

