కలం, హనుమకొండ : వరంగల్ పోలీసులు (Warangal Police) తమతో కలిసి పనిచేసిన అధికారులను ఎప్పటికీ గుండెల్లో నిలుపుకుంటారని పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh) అన్నారు. ఇటీవల ఐపీఎస్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ అయిన సన్ప్రీత్ సింగ్ గురువారం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీస్ అధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 15 నెలలపాటు విధులు నిర్వహించిన కాలంలో ప్రతి అధికారి, ప్రతి పోలీస్ సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నారు. కమిషనరేట్లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించడంలో విశేష ఫలితాలు సాధించగలిగామని పేర్కొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని.. ఇక్కడి అధికారులు, సిబ్బంది, ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ధార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు (ఆర్.ఐలు), ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

