కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై ఈ నెలాఖరు నుంచి సుమారు 3 నెలల పాటు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర నేతలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమావేశమై.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మొదట కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే.. బీజేపీ కుట్రలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని అభిప్రాయపడింది.
నీట్ లీకేజీతో విద్యార్థుల ఆత్మహత్యలు..
నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని రాహుల్ గాంధీ ఆందోళన చెందారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, మోదీ వైఫల్యమేనన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అంత త్వరగా వదిలిపెట్టబోదన్నారు. అదే సమయంలో CBSE ఆన్లైన్ పేపర్ల దిద్దుబాటులో జరుగుతున్న గోల్మాల్ గురించి వివరించారు. వీటితో పాటు దేశాన్ని పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణం విషయంలో కేంద్రం చేష్టలుడిగి చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సమస్యలపై బలంగా పోరాటం చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు.

