కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా దస్తూరాబాద్ (Dasturabad), పెంబి (Pembi) మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యా బోధన, వసతి, ఆహారం, పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. అనంతరం వంటశాల, సరుకుల నిల్వ గది, భోజనశాలను తనిఖీ చేసి అక్కడి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మెస్ కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ నాణ్యమైన కూరగాయలు, ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, వంటశాలలో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటించాలని కలెక్టర్ (Bhavesh Mishra) ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు, స్టాక్ రిజిస్టర్ను క్రమం తప్పకుండా నవీకరించాలని సూచించారు.
అనంతరం పదో తరగతి గదికి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి జవాబు పత్రాలను పరిశీలించి, గణితం, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించారు. కొంతమంది విద్యార్థులను బోర్డుపై లెక్కలు చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పాల్గొన్నారు.
Read Also: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్!
Follow Us On: X(Twitter)

