కలం, నల్లగొండ బ్యూరో: మనిషికి సంపూర్ణ ఆరోగ్యమే గొప్ప సంపద అని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ (Collector Chandrashekar) అన్నారు. శారీరక, మానసిక ధృడత్వం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘సొసైటీ ఫర్ తెలంగాణ రన్’ ఆధ్వర్యంలో 2కే, 5కే, 10కే రన్లను నిర్వహిస్తున్నారు. అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆరోగ్య హాస్పిటల్స్ సహకారంతో ఆదివారం నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం నుంచి ఏర్పాటు ఈ రన్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (Sharat Chandra Pawar) తో కలిసి కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Chandrashekar) మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ప్రజల ఆరోగ్య విషయమై ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషం అని అన్నారు. త్వరలోనే యోగా దినోత్సవం రానుందని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అప్పుడే మన పనులు మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్వర్తించుకోగలుగుతామని తెలిపారు. సమాజంలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండటమే ముఖ్య ఉద్దేశమని, అలాంటి భావనను ప్రజల్లో తీసుకొచ్చేందుకు ఇలాంటి రన్లు ఉపయోగపడతాయని అన్నారు. వీటివల్ల మనం ఏ పని చేసినా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని, ఆరోగ్యానికి మించిన గొప్ప సంపద మరొకటి లేదని అన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఆరోగ్యం విషయమై 5కే, 10కే, 2కే రన్లు నిర్వహించడం సంతోషమని, ఇటువంటి కార్యక్రమాలు జిల్లాలో మరిన్ని నిర్వహించాలని కోరారు. ప్రతి మనిషి జీవితంలో శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని, రోజువారీ కార్యక్రమంలో దీనిని అలవాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ తెలంగాణ మగ్గారి శ్రీనివాసరావు, వాకర్స్ అసోసియేషన్ బండారు ప్రకాష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్, అనితా రాణి, డీఎస్పీ శివరామిరెడ్డి, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సుమారు వెయ్యి మంది వరకు ఈ రన్లో పాల్గొన్నారు.
Read Also: హార్దిక్ పాండ్యా ఒంటరి అయ్యాడు: మనోజ్ తివారి
Follow Us On: Sharechat

