కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్లో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని 21 రోజులుగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు శనివారం ఉదయం బలవంతంగా భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. సోనమ్ వాంగ్చుక్ స్థానంలో తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే (Abhijit Deepke) ప్రకటించారు.
మేం ఇక్కడే ఉంటాం.. పోరాటం ఆపేది లేదు..!
ఈ సందర్భంగా అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ పోరాటాన్ని అణచివేయాలని చూస్తోందని మండిపడ్డారు. పోలీసులు ఎంతలా అడ్డుకున్నా, తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు అని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించినంత మాత్రాన తమ ఉద్యమం చల్లబడదని తేల్చి చెప్పారు. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు సాగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎల్లుండి పార్లమెంట్ భవనం వరకు భారీ పాదయాత్ర చేపడుతామని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

