కలం, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ “విక్రమ్-1” (Vikram-1 Launch) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగం విజయవంతమైంది. శనివారం మధ్యాహ్నం 12:05 గంటలకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
సాంకేతిక సమస్యల వల్ల స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, ‘మిషన్ ఆగమన్’ దిగ్విజయంగా సాగింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ కంపెనీ “స్కైరూట్ ఏరోస్పేస్” ఈ రాకెట్ను పూర్తిగా ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపకల్పన చేసింది. 46 ఏళ్ల క్రితం ఇస్రో ప్రయోగించిన ఎస్.ఎల్.వి-3 (SLV-3) చారిత్రాత్మక ప్రయోగాన్ని గుర్తుచేస్తూ, సరిగ్గా అదే తరహాలో సరికొత్త ప్రైవేట్ విప్లవానికి ఈ మిషన్ నాంది పలికింది.
“మిషన్ ఆగమన్” పేరుతో చేపట్టిన ఈ తొలి ప్రయోగాత్మక పరీక్ష ద్వారా చిన్న ఉపగ్రహాలను, సాంకేతిక ప్రదర్శన పేలోడ్లను భూమికి దగ్గరగా ఉండే లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి ప్రవేశపెట్టడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతీయ ప్రైవేట్ కంపెనీ సొంతంగా తయారు చేసిన రాకెట్ను భారత గడ్డపై నుంచి అంతరిక్ష కక్ష్యలోకి పంపడం దేశంలోనే ఇదే తొలిసారి కావడంతో ఈ ప్రయోగానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో, 3D ప్రింటెడ్ ఇంజన్ల వంటి అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ రాకెట్ విజయం.. ప్రపంచ కమర్షియల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో భారతదేశ స్థానాన్ని మరింత పటిష్టం చేయడమే కాకుండా, రాబోయే రోజుల్లో దేశీయ ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్ వృద్ధిని విపరీతంగా వేగవంతం చేయనుంది.

