కలం, హనుమకొండ : పరకాలలో ఈ నెల 16న ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి పాల్గొనే సభకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి (Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి పరకాలలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని ప్రతిపాదిత హెలిప్యాడ్ స్థలంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాల్లో సభా వేదిక, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.
హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, సభా ప్రాంగణం, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీపీ ఎన్. శ్వేత మాట్లాడుతూ సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ హెలిప్యాడ్, రూట్మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్, సీపీ సూచించారు.

