కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్తు, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన వర్ష ప్రభావిత ప్రాంతాలపై సమీక్షించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నగర వాసులకు ఇబ్బందులు కలగొద్దన్నారు. అలాగే, వాతావరణ శాఖ నుంచి నిరంతరం డేటా సేకరించుకుంటూ రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగానే సిబ్బందిని మోహరించాలని ఆదేశించారని సీఎంవో వెల్లడించింది.

