కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోపాటు కర్ణాటక జలాశయాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కర్ణాటకు జలాశయాల నుంచి భారీగా వరద నీరు జూరాల జలాశయానికి అక్కడి అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకుగాను 117.080 టీఎంసీలు ఉండగా, రిజర్వాయర్కు 83,386 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది.
దిగువకు 1.10లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 33.313 టీఎంసీలకుగాను 30.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 95వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో డ్యాం గేట్ల ద్వారా 1.10లక్షల క్యూసెక్కుల కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రి కర్ణాటక జలాశయాల నుంచి జూరాలకు 1,04,575 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో జూరాల 17 గేట్ల తెరిచి దిగువకు 67,235 క్యూసెక్కులు నీటిని వదిలారు.
విద్యుదుత్పత్తికి 37,906 క్యూసెక్కులు, కుడి, ఎడమ, సమాంతర కాలువలతో పాటు ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తుండగా.. మొత్తం 1,09,519 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.817 టీఎంసీల నిల్వలు ఉన్నట్లు జూరాల అధికారులు తెలిపారు. జూరాల కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో జూరాల అధికారులు అప్రమతమై ప్రాజెక్టు కు వస్తున్న వరదను అలాగే దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా, మరో వారం రోజుల పాటు వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో లోతట్టు, నదీపరిహార ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

