కలం, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లె వేదికగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిండు సభలో కేంద్రమంత్రిని “మావయ్య” అని పిలవటం టీడీపీ శ్రేణుల్లో, ప్రజల్లో జోష్ నింపింది. “ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అవర్ హానరబుల్ మినిస్టర్ ‘అవర్ మామ’ ఈజ్ వెరీ పాపులర్, హి ఈజ్ పీపుల్స్ మ్యాన్” అంటూ నవ్వులు పూయించారు. మీరు అతనిని ఏమైనా కోరితే వారు తీరుస్తారు.. మావయ్య అని అందరూ గట్టిగా పిలవండి అంటూ సభలో ఉత్సాహం నింపారు. “మీరు మామ అని పిలిస్తే తక్షణమే పలికి మీరు కోరిన వరాల ఇచ్చే వ్యక్తి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్” అని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలతో సభ అంతా జోష్ ఫుల్గా మారింది.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ అజివికా మిషన్ను గురువారం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులు అందచేశారు. వీబీజీ రామ్ జీ పథకం సమాచార బుక్ లెట్, కంపెండియం అఫ్ ఆర్టికల్స్, మిషన్ పోర్టల్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వికసిత్ భారత్ రోజ్గార్ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని వ్యాఖ్యానించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని అభిప్రాయపడ్డారు. గతంలోని నరేగా పథకానికి మెరుగైన సవరణలతో ప్రధాని మోదీ వీబీ జీరామ్జీని తీసుకొచ్చారని చెప్పారు. పని రోజులు 100 నుంచి 125 రోజులకు పెంచడం సంతోషించదగిన విషయమని అన్నారు. వీబీ జీరామ్జీని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

