కలం, వెబ్ డెస్క్ : ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా గ్రామస్తులు ఒక్కటయ్యారు. ప్రభుత్వ స్పందన కోసం కాలయాపన చేయకుండా తమ శ్రమదానంతోనే ఒక కర్రల వంతెనను నిర్మించుకుని ఆదర్శంగా నిలిచారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి (Chintapalli Tribal) మండలం తాజంగి పంచాయతీ పరిధిలో ప్రవహిస్తున్న భారీ వాగుపై ఈ తాత్కాలిక వంతెన నిర్మాణం జరిగింది. బోయపాడు, బూడిదపాడు, వనజాజుల గ్రామాలకు చెందిన ప్రజలు ఏకమై కర్రలను సమకూర్చుకుని వంతెనను ఏర్పరిచారు. పాఠశాల విద్యార్థులు, స్థానిక గ్రామస్తుల రోజువారీ రాకపోకలకు ఈ మార్గం కీలకం కావడంతో తమ సమస్యకు తామే తక్షణ పరిష్కారం వెతుక్కున్నారు.
అయితే వర్షాకాలంలో ఈ కర్రల వంతెన దాటడం ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా స్పందన లేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి శాశ్వత కాంక్రీట్ బ్రిడ్జి మంజూరు చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.

