కలం, కరీంనగర్ : తెలంగాణ వీరమట్టిలో పుట్టి, నైజాం రజాకార్ల అరాచకాలకు, భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ధీరవనిత వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ilamma) అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కొనియాడారు.
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితమైంది కాదని, అది మొత్తం తెలంగాణ ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని చారిత్రాత్మక ట్యాంక్ బండ్పై వివిధ రంగాల్లో సమాజానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను ఏ రీతినైతే సముచితంగా ప్రతిష్టించారో, అదే విధంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, బిజెపి నాయకులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ స్మారకానికి శ్రద్ధాంజలి ఘటించారు.

