కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Parliament Session) కీలక బిల్లులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు జులై 20 నుంచి ఆగస్టు 13 తేదీ వరకు జరుగనున్న సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఏడు కీలక బిల్లులను (Lok Sabha Bills) కేంద్రం ప్రవేశపెట్టనుంది. మొత్తం ఏడు బిల్లులతో ఐదు సరికొత్త బిల్లులు కాగా, గత సమావేశాల్లో ప్రవేశ పెట్టిన రెండు పాత బిల్లులు ఉన్నాయి. లోక్ సభలో కొత్తగా ప్రవేశ పెట్టబోయే బిల్లులలో ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు-2026, సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026లు అత్యంత కీలకం. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం అత్యవసర ఆర్డినెన్స్ల స్థానంలో ఉండగా.. లోక్ సభలో చట్టబద్ధత కోసం రానున్నాయి.
మరో బిల్లు జనన–మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026ను కేంద్రం ప్రవేశపెట్టబోతుంది. జనన, మరణాల నమోదు చట్టంలో మార్పులు చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. జాతీయ గౌరవానికి సంబంధించిన చట్టంలో సవరణలు చేస్తూ జాతీయ గౌరవానికి అవమానం నివారణ (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టనున్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించిన చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు–2026ను సైతం సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది.
ఇక ఇప్పటికే 2026 మార్చి 25న విదేశీ విరాళాల నియంత్రణ (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టగా.. పార్లమెంట్ సమావేశాల్లో పరిశీలనకు తీసుకురానున్నారు. ఇక మరో బిల్లు వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు–2025ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. 2025 డిసెంబర్ 15న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. తాజాగా ఈ బిల్లుపై తదుపరి చర్చకు ప్రభుత్వం తీసుకురానుంది.

