కలం, వెబ్ డెస్క్ : కేబుల్ టెలివిజన్ (Cable TV) నెట్వర్క్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలకమైన సవరణ చేసింది. టీవీ ఛానెళ్లలో గంటకు 12 నిమిషాల ప్రకటనల పరిమితిని తొలగిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (అమెండ్మెంట్) రూల్స్ 2026 పేరిట జీఎస్ఆర్ 751(ఈ) ద్వారా ఆగస్టు 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995లోని సెక్షన్ 22 కింద ఉన్న అధికారాలను వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కొత్త మార్పులో భాగంగా 1994 నిబంధనలలోని రూల్ 7 సబ్-రూల్ (1) / (11) పరిమితిని తొలగించారు. అధికారిక గెజిట్లో ప్రచురితమైన నాటి నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. డిజిటల్ మీడియాతో పోటీ పడుతున్న టీవీ ఛానెళ్లకు సమాన అవకాశాలు కల్పించేందుకు, ప్రసార రంగానికి లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఈ చర్య చేపట్టింది. దీనివల్ల న్యూస్ ఛానెళ్లతో పాటు ఇతర టీవీ ప్రసారకర్తలకు యాడ్స్ ద్వారా లభించే ఆదాయం పెరిగేందుకు మార్గం సుగమమైంది. 1994లో చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2025 జనవరి వరకు మొత్తం 27 సవరణలు జరిగాయి. తాజాగా చేసిన మార్పు టీవీ పరిశ్రమలో ప్రకటనల నియంత్రణకు మరింత ఊరటనిస్తోంది.

