కలం, నిర్మల్ : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తానూర్ (Tanur) మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నాయకురాలు పడకంటి రమాదేవి మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి పొందాల్సిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలవాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

