కలం, వెబ్ డెస్క్: గవర్నర్ తో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దం చెప్పించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి గవర్నర్ ప్రసంగంలో లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొదటి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా అవుతుందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలపై గవర్నర్ ప్రసంగంలో ఉంటుందని అనుకున్నామని, కానీ అలా జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మూడో బడ్జెట్ అని ఆయన (Padi Kaushik Reddy) చెప్పుకొచ్చారు.
మొత్తంగా 60 నుంచి 65 శాతం బడ్జెట్ పూర్తి అయినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. రైతు భరోసా ఇస్తున్నాం.. రైతుల అకౌంట్లో పడుతుందో లేదో తనకు తెలియదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీలపై గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు? అంటూ ప్రశ్నించారు. వీటన్నింటి గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదని చెప్పారు. యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని తాము ప్రభుత్వాన్ని అడుగుతున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లోని అశోక్ నగర్ వెళ్ళి యువకులను రెచ్చగొట్టారని మండిపడ్డారు. మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటూ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తాము ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తగిన సమయంలో యువత కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్దమయ్యారని కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.

