కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం(Khammam) నగరంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనను బీఆర్ఎస్ (BRS) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై స్పందించిన పార్టీ నేతలు, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం శుక్రవారం ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసును ఫాస్ట్-ట్రాక్ కోర్టులో (Fast Track Court) విచారించి బాధిత బాలికకు త్వరితగతిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని పాఠశాలలు, హాస్టళ్లు, అపార్ట్మెంట్లలో మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక నిఘా, పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, పోక్సో చట్టంపై ప్రజలలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేరస్థులు ఏ స్థాయిలో ఉన్నా వదలకుండా కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, రెంటాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

