కలం, వెబ్ డెస్క్ : మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ (BRS) షాక్ ఇచ్చింది. మొయినాబాద్ ఫాం హౌజ్ లో జరిగిన ఒక పార్టీలో రోహిత్ రెడ్డి పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగం జరిగినట్లు మీడియాలో వస్తున్న కథనాలు, ఇతర సమాచారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన పార్టీ ప్రతిష్టకు, విశ్వసనీయతకు భంగం కలిగించేలా ఉందని భావించిన క్రమశిక్షణ కమిటీ, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసు అందిన ఏడు రోజులలోపు రోహిత్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన లిఖితపూర్వక వివరణను సమర్పించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయన ఎటువంటి పార్టీ కార్యక్రమాల్లో గానీ, అధికారిక సమావేశాల్లో గానీ పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంలో విఫలమైతే, పార్టీ నియమావళి ప్రకారం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ హెచ్చరించింది.

