కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే కాలేజీ అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మోసం చేసిందన్నారు.
ఫ్రీ స్కూటీ హామీ మేరకు కాంగ్రెస్ నేతల షోరూమ్ ల నుంచి స్కూటీలను ఎత్తుకెళ్లాలని విద్యార్థినులకు రాకేశ్ రెడ్డి సంచలన పిలుపునిచ్చారు. ప్రియాంకా గాంధీ వచ్చే వరకు షోరూముల్లో ఒక్క స్కూటీ కూడా ఉండకూడదని సూచించారు. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమయిందని ఆయన (MLA Rakesh Reddy) విమర్శించారు.
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే తొలి సంతకం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల ఫైల్ మీదనే ఉంటుందని తెలిపారు. కాగా, స్కూటీలు ఎత్తుకెళ్లాలని స్వయంగా ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

