కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో నాకా బందీ (Naka Bandi) కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. శనివారం రాత్రి 7.30 గంటల నుంచి 10 గంటల వరకు ఈ నాకాబందీ కార్యక్రమం ద్వారా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్థులను కనిపెట్టడానికి ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టామన్నారు.
గ్రామాల్లోనూ తనిఖీలు..
జిల్లాలోని ఐదు సబ్ డివిజన్ల పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు గ్రామాల్లో డీఎస్పీల ఆధ్వర్యంలో నాకాబందీని నిర్వహించినట్లు ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు.

