కలం, వెబ్ డెస్క్: బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. బ్యాంక్ ఆఫ్ ఇండియా 779 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (Banking Officer) పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. గత నెల 30వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 20వ తేదీతో ముగియబోతుంది. ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించబోతుండగా.. పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు.
తొలి నెల నుంచే రూ.60వేలకు పైగా వేతనం..
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లలో మూడు రకాల గ్రేడ్లున్నాయి. వీరిని క్రెడిట్ ఆఫీసర్లుగా కూడా పిలుస్తుంటారు. కేటగిరీల వారీగా వేతనాలు కూడా ఫిక్స్ చేసి ఉంటాయి. మొదటి గ్రేడ్ అయిన మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ ఆఫీసర్ ప్రారంభ నెల వేతనం రూ.64వేలుగా నిర్ణయించారు. అదే సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ ఆఫీసర్ నెల వేతనం రూ.లక్షకు పైగా ఉంటుంది. పదోన్నతుల ఆధారంగా వేతనాలు, ఇతర అలవెన్సులు పెరుగుతుంటాయి.
అర్హతలు ఇవే..
ఈ పోస్టులకు కనీసం డిగ్రీ చదివి, 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. రిజర్వేషన్లు, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సు మినహాయింపు ఉంది. నిబంధనల ప్రకారం, రిజర్వేషన్లు ఉంటాయి. వాటి ప్రకారం, ఆయా కేటగిరీలకు ఎంపిక చేస్తుంటారు.
పరీక్ష ఎలా ఉంటుంది..
అబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో పరీక్ష జరుగుతుంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్టులో 25 ప్రశ్నలు, అభ్యర్థి ఎంచుకున్న పోస్టును బట్టి దానిలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్క్ ఉంటుంది. 125 నిమిషాల్లో 125 ప్రశ్నలు పూరించాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇందులో ప్రతిభ చూపినవారినే ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. అక్కడ నిపుణులతో ముఖాముఖి జరిగాక.. తుది ఫలితాలు వెల్లడిస్తారు.
పరీక్షా కేంద్రాలు ఎక్కడంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూర్, విజయవాడ నగరాల్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేస్తున్నప్పుడే ఎక్కడ పరీక్ష రాస్తారో.. స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పెట్టినట్లు పేర్కొంది.

