కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికల(Bangladesh Elections) పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటింగ్ కొనసాగుతోంది. సుమారు 18 నెలల క్రితం విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన భారీ ఆందోళనలతో అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. అనంతరం పలు అల్లర్ల తర్వాత ఈ కీలక ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 299 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 42,779 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
ఈసారి పార్లమెంట్ ఎన్నికలతో పాటు (Bangladesh Elections) 84 అంశాల సంస్కరణల ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహిస్తున్నారు. షేక్ హసీనా (Sheikh Hasina) నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అనుమతి లేదు. ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), దాని మాజీ మిత్రపక్షం జమాత్-ఇ-ఇస్లామీ మధ్య నెలకొంది. మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు, 60 ఏళ్ల తారిఖ్ రహ్మాన్ ఈ ఎన్నికల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన 17 సంవత్సరాలు వేరే దేశంలో ఉండి ఇటీవల ఢాకాకు తిరిగి వచ్చారు. యువతకు ఉద్యోగాలు సృష్టిస్తామని, చట్టం, శాంతి పరిరక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛను పెంపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం 50 రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి. 1,755 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 273 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 9 లక్షల భద్రతా సిబ్బందిని నియమించారు.
Read Also: రోవన్ అట్కిన్సన్ సంచలన నిర్ణయం.. 160 మిలియన్ డాలర్ల విరాళం
Follow Us On: Sharechat


