కలం, వెబ్ డెస్క్: రాయచోటి (Rayachoti)లో రాజకీయ హింస తీవ్ర రూపం దాల్చుతోంది. వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) మధ్య భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా వైసీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిపై వేటకొడవళ్లతో దాడి జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని దశరథరామి రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు స్టే ఉన్న ఓ స్థల వివాదంలో సెటిల్మెంట్ పేరుతో రంగంలోకి దిగిన మంత్రి అనుచరులు, శనివారం రాత్రి నుంచి ఆ స్థలంలో హంగామా సృష్టిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దశరథరామి రెడ్డితో పాటు అతడి అనుచరులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దాడి సమయంలో మంత్రి అనుచరులు బీభత్సం సృష్టించి దశరథ రామిరెడ్డికి చెందిన కల్యాణ మండపం అద్దాలను, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడితో రాయచోటి పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి. పట్టపగలే దాడులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

