కలం, జగిత్యాల: బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ (Arvind Dharmapuri Foundation) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి డాక్టర్ భోగ శ్రావణి అన్నారు. అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కార్యకర్తల సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ శ్రేణులకు నిత్యం అండగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న బూత్ స్థాయి కార్యకర్తల సేవలను గవర్నర్ ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి డాక్టర్ భోగ శ్రావణి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా భోగ శ్రావణి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తలే పునాది అని పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తల సంక్షేమానికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలిచే కార్యక్రమాలను ఫౌండేషన్ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, అరవింద్ ఫౌండేషన్ సభ్యులు, బూత్ స్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

