కలం, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం (AP Liquor Transport Scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. మద్యం రవాణా టెండర్లలో భారీ అవినీతి చోటుచేసుకున్నట్లు గుర్తించారు. లిక్కర్ రవాణాలో భారీ కుట్ర పన్నినట్లు చెబుతోన్న ఈడీ.. అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి (MD Vasudeva Reddy) ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. జిల్లా స్థాయిలో కార్టన్కు సగటున రూ.19.68 ఉన్న రవాణా రేట్లను రూ.35.57 వరకు పెంచి, భారీగా అక్రమ లాభాలు పొందినట్లు అధికారులు తెలిపారు. అనుకూల నివేదికలతో తప్పుదారి పట్టించి అక్రమాలు చేశారని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే మద్యం రవాణా కాంట్రాక్టుల గడువు పొడిగించిందని పేర్కొన్నారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల వలన, ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.195 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు ముమ్మరం చేశామని.. మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

