కలం, వెబ్ డెస్క్ : ఏపీలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వాతావరణ పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు (Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. రేపటి (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎండల తీవ్రత పెరుగుతున్న వేళ విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు (Half Day Schools) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నీ ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందించాలని తెలిపారు.

