కలం, వనపర్తి: అజ్జకొల్లు గ్రామానికి అదనపు ఏఎన్ఎంలతో పాటు డాక్టర్ ఎంఎల్హెచ్పీని నియమించి, గ్రామంలో 10 పడకల ఆసుపత్రిని ఏర్పాటు (Ajjakollu Hospital) చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ (BC JAC) వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు కోరారు. సోమవారం మదనాపురం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవోకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ నాయుడు మాట్లాడుతూ.. అధిక జనాభా కలిగిన అజ్జకొల్లు గ్రామంలో ప్రస్తుతం ఒకే ఏఎన్ఎం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామానికి మరో ఏఎన్ఎంను నియమించడంతో పాటు డాక్టర్ ఎంఎల్హెచ్పీని అందుబాటులో ఉంచాలని కోరారు.
గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని, వెంటనే 10 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సక్రమంగా అందుబాటులో ఉంచాలని మండల వైద్యాధికారిని కోరారు. దీనిపై మండల వైద్యాధికారి భవాని సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మహేందర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలవర్ధన్, వెంకటేష్ పాల్గొన్నారు.

