కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెలైన ప్రభుత్వంలో విలీనం, యూనియన్స్ పునరుద్ధరణ డిమాండ్ను తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ (AITUC) జాతీయ నేత సురవరం విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉమ్మడి మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా ఏఐటీయూసీ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతృత్వంలో మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ కి ఆర్టీసీ సమ్మె కాలం హామీలు వెంటనే అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సురవరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు రక్త మాంసాలను కరిగించి ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. లక్షలాదిమంది పేదలను నిత్యం ఆర్టీసీ బస్సు ద్వారా గమ్యాలకు క్షేమంగా చేరవేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తిలోదక విధానాలతో నిత్యం కార్మికులు అనేక ఇబ్బందులకు, వేధింపులకు, పని భారంతో బస్సు స్టీరింగ్ పైన ఊపిరి వదులుతున్నారని వాపోయారు. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం కార్మికుల శ్రమ ఫలితమేనని అన్నారు. గత పాలకుల నియంతృత్వ పోకడలతో ఆర్టీసీ రంగంలో యూనియన్స్ రద్దు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానం, సమ్మె కాలంలో ప్రభుత్వం అంగీకరించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్స్ పునరుద్ధరణ చేయాలని సూచించారు.
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట మారుస్తే ప్రభుత్వ మనుగడ సాధ్యం కాదని హితవు పలికారు. ఉమ్మడి జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీలకు గతంలో రద్దు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధనకే కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్, ఏఐటీయూసీ గద్వాల జిల్లా అధ్యక్షులు బి. ఆంజనేయులు, ఏఐటీయూసీ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పి.సురేష్, ఉమ్మడి ఏఐటీయూసీ నాయకులు నాగార్జున, పాముల ఆంజనేయులు, మహిళా సంఘం నేత అరుణ తదితరులు పాల్గొన్నారు.

