కలం, వెబ్ డెస్క్ : సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణలతో ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan), పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రమాదకర స్థాయికి చేరింది. తమ దేశంలో వరుస పేలుళ్లకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఎ-తాబన్ పాకిస్తాన్ (TTP) మూకలకు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తుందని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు భూభాగాలపై పాకిస్థాన్ వైమానికి దళం దాడులకు తెగబడింది . తమ భూభాగంలో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 13 సాధారణ పౌరులు మరణించారని.. అందులో 11 మంది చిన్నారులే ఉన్నారని ఆఫ్ఘనిస్థాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్లలోని పౌరుల నివాసాలపై పాక్ బాంబు దాడులు చేసిందని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు. ఈ దాడుల్లో 11 మంది పిల్లలతో సహా 13 మంది దుర్మరణం చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. తాము పాక్ దేశంలో దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామనే అసత్య ఆరోపణలతో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సరైన ప్రతిఫలం అందుకుంటారని పాకిస్థాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న పాక్ చర్యలను భారత్ ఖండించింది. పాక్ జరిపిన అనైతిక చర్యల వల్ల అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని మండిపడింది.

