కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు నల్లకుంట చెరువును కాలుష్య కోరల్లో నుంచి రక్షించాలని దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. హెటిరో కంపెనీ పూర్తి స్థాయిలో రసాయనలను శుభ్రం చేయకుండా, సుందరీకరణ పేరుతో కాలుష్యాన్ని కప్పిపుచ్చుతోందన్నారు. కంపెనీ యాజమాన్యానికి స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పూర్తిగా సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. దోమడుగు కాలుష్య సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) సుమోటో కేసు ఇంకా విచారణలో ఉందన్నారు. అయినా, చెరువులోని రసాయన విషాన్ని శాస్త్రీయంగా శుద్ధి చేయకుండా, సాక్ష్యాలను నాశనం చేయడానికి కంపెనీ చేస్తున్న సుందరీకరణ పనులకు అధికారులు ఎలా సహకరిస్తారని నిలదీశారు. కలెక్టర్ స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కన్వీనర్లు మంగయ్య, బాల్ రెడ్డి, కో-కన్వనర్లు సత్తిరెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు.

