కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులను విస్తృతం చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హెచ్ఎండీఏ (HMDA )చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ( HMDA Chief Engineer Bachu Ravinder) ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నానక్ రామ్ గుడాలోని తన నివాసం సుమధుర అపార్ట్మెంట్స్లో భారీ సోదాలు చేపట్టిన అధికారులు.. ఏకకాలంలో 12 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో సోదాలు చేస్తున్న అధికారులు.. ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, లాకర్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు, ఇతర కీలక ఆధారాలను పరిశీలిస్తున్నారు. బచ్చు రవీందర్ ఇల్లు, ఆయన బంధువులు, అత్యంత సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
తనిఖీలు పూర్తయ్యాక స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్, ఇతర ఆధారాలను పరిశీలించి అధికారిక నివేదిక సిద్ధం చేయనున్నారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. ఇటీవల అవినీతి ఆరోపణలపై ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్పై వచ్చిన ఆరోపణలపై కూడా ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేస్తోంది.

