కలం, వరంగల్ బ్యూరో: నిజాయితీగా పనిచేసే అధికారి ట్రాన్స్ ఫర్ మీద వెళ్లిపోతుంటే ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడం మనం చూస్తుంటాం. ఆ అధికారినే కొనసాగించాలని కోరుతుంటారు. అలాగే అవినీతిపరులు, ప్రజలను పీడించే అధికారులు ఎప్పుడెప్పుడు వెళ్లిపోతారా? అని కూడా ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఓ అధికారి ఏసీబీ(ACB)కి చిక్కినందుకు రైతులు సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. తమ ఉసురు తగిలిందంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ ఘటన శనివారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద చోటు చేసుకున్నది. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి (Hanamkonda Additional Collector) ఇటీవల ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో తాజాగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. హన్మకొండ కలెక్టరేట్ ముందు ఊరుగొండ గ్రామానికి చెందిన రైతులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూముల స్వాధీనం విషయంలో కలెక్టర్ తమకు న్యాయం చేయలేదని ఆరోపించారు.
అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి (Hanamkonda Additional Collector) ఏసీబీ వలలో చిక్కుకోవడం తమ శ్రమ ఫలితమని రైతులు వ్యాఖ్యానించారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో పోతున్న తమ భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా వెంకటరెడ్డి అడ్డుపడుతూ వచ్చినట్లు రైతులు ఆరోపించారు. “మా ఉసురు తాకింది… మా కన్నీళ్లకు న్యాయం దొరికింది” అని రైతులు నినాదాలు చేశారు. భూముల విలువలు తగ్గించి చూపించారని.. పత్రాల పరిశీలనలో ఆలస్యం చేశారని రైతులు ఆరోపించారు. పరిహారం విషయంలో ఆపసోపాలు పెట్టారని మండిపడ్డారు. కావాలనే తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని అడిషనల్ కలెక్టర్ నిలిపేశారని ఆరోపించారు.
Read Also: రోడ్ టెర్రర్: గంటకు 20.. రోజుకు 485 మంది!
Follow Us On : Facebook


