కలం, నల్లగొండ బ్యూరో: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) సోమవారం ఆందోళనకు దిగింది. నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎమ్మార్పీఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మంత్రి నివాసం వైపు దూసుకెళ్లారు.
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా వారు నినాదాలు చేశారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయ ముట్టడికి యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ.. రాజకీయాల్లో దళితులకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించి సామాజిక న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిమాండ్ నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
Read Also: హెడ్ ఆఫ్ది డిపార్టుమెంటుగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్..
Follow Us On: Instagram

