కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో హోలీ (Holi) పండుగ వేడుకలు విషాదాంతమయ్యాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా రంగుల పండుగ జరుపుకొన్న వ్యక్తి నదిలో స్నానానికి వెళ్లి కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి మరణించాడు. మణుగూరు (Manuguru) మండలం పద్మగూడెం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పద్మగూడెం గ్రామస్తులు మంగళవారం ఉదయం నుంచి హోలీ వేడుకలు చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు సరదాగా మల్లెపల్లిలో గోదావరి స్నానాలకు వెళ్లారు. అక్కడే వంట కూడా చేసుకున్నారు. అదే సమయంలో స్నానం చేయడం కోసం నదిలోకి దిగిన కుటుంబసభ్యులు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.
ఇది గమనించిన పద్ధం ప్రసాద్ అనే వ్యక్తి వాళ్లను కాపాడేందుకు నదిలోకి దిగి, ఇద్దరిని కాపాడాడు. మూడో వ్యక్తి గుండి నాగేశ్వర రావును కూడా కాపాడేందుకు ప్రయత్నించగా వరద తాకిడి పెరిగి ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మణుగూరు (Manuguru) పోలీసులు తీవ్రంగా గాలించగా బుధవారం మృత దేహాలు లభ్యమయ్యాయి. డ్రైవర్గా పని చేస్తున్న గుండి నాగేశ్వర రావు, సింగరేణి ఉద్యోగి పద్ధం ప్రసాద్ విగత జీవులుగా ఇంటికి చేరడంతో గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు.ఆనందంగా మొదలైన హోలీ తమ జీవితాల్లో ఎన్నటికీ తీరని విషాదాన్ని మిగిల్చిందని బాధిత కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Read Also: ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం.. సరిహద్దులో హై అలర్ట్
Follow Us On: X(Twitter)

