కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు (Amanagallu) గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించింది. ఈ క్రమంలో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో నియంత్రణ కోల్పోయి పలువురు నేరుగా మండుతున్న అగ్నిగుండంలోనే పడిపోయారు.
ఈ ఊహించని ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి నిప్పుల్లో పడిపోతున్న వారిని బయటికి లాగడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

