కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా హాలియా (Haliya) సమీపంలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ (Nagarjuna Sagar Left Canal)లో ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు పడి గల్లంతయ్యారు. హోలీ పండుగ నేపథ్యంలో సరదాగా గడపాల్సిన సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం సిరిసినగండ్ల గ్రామానికి చెందిన బబ్లు (17) అనే యువకుడు హాలియా సమీపంలోని ఎడమ కాలువ వద్దకు వెళ్లాడు. కాలువలో చేతులు కడుక్కోవడానికి ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు.
గమనించిన నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్ (14), బబ్లును కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే, కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో కార్తీక్ సైతం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ఈతగాళ్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు కిలోమీటరు మేర కాలువ వెంట గాలిస్తున్నారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. తమ పిల్లలు ప్రవాహంలో కలిసిపోవడంతో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

