కలం, డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో (HCA) రూ.70 కోట్ల అవినీతి జరిగిందంటూ క్రికెట్ సంఘాలు ఆరోపించాయి. జింఖానాలో హెచ్ సీఏ ప్రెసిడెంట్ అమర్ నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగానే.. అక్కడకు పెద్ద ఎత్తున క్రికెట్ సంఘాలు చేరుకుని ప్రెస్ మీట్ ను అడ్డుకున్నాయి. హెచ్ సీఏలో (HCA) రూ.70 కోట్ల అవినీతి జరిగిందని.. ఆ సొమ్మును మంత్రి వివేక్ వెంకటస్వామి కంపెనీ విశాఖ ఇండస్ట్రీస్ కు అక్రమంగా చెల్లించారంటూ ఆరోపించారు క్రికెట్ సంఘాల నేతలు. మంత్రి ఆదేశాలతోనే ఆ నిధులను హెచ్ సీఏ పెద్దలు రిలీజ్ చేశారంటూ ఆరోపించారు. అయితే క్రికెట్ సంఘాల ఆరోపణలను కొట్టిపారేస్తూ హెచ్ సీఏ ప్రెసిడెంట్ అమర్ నాథ్ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే.. క్రికెట్ సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
స్పందించిన అమర్ నాథ్.. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవం అని తెలిపారు. ‘నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి చెక్కులను జారీ చేయలేదు. ఏ చెక్కు మీద నేను సంతకం చేయలేదు. రూ.69 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్ కు చెల్లింపుల వెనక నా ప్రమేయం లేదు. నేను ఛార్జ్ తీసుకోకముందే ఆ ప్రాసెస్ జరిగింది. డబ్బులు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు అమర్ నాథ్. ఇక ఆందోళన చేస్తున్న క్రికెట్ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

