కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమవుతున్న ఇరాన్ పగతో రగలిపోతోంది. శత్రువులపై అంతులేని కోపంతో ఉంది. ఈ క్రమంలో ఇరాన్లోని పురాతన నగరమైన కోమ్లోని జమ్కరన్ (Jamkaran Mosque) మసీదుపై ఆదివారం ఎర్ర జెండా ఎగిరింది.
ఈ మసీదు ఇరానీయుల సంస్కృతికి, మతానికి ప్రతీకగా భావిస్తారు. దీనిపై రెడ్ ఫ్లాగ్ ఎగరేయడం అంటే శత్రువులకు హెచ్చరిక పంపడం లాంటిదే. ఎందుకంటే తమకు తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం సూచనగా ఈ రెడ్ ఫ్లాగ్ ఎగరేస్తారు. దీన్ని న్యాయం, పగకు సింబల్గా భావిస్తారు. ప్రస్తుతం ఎర్ర జెండా ఎగరేయడం ఖమేనీ మద్దతుదారుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని సూచిస్తున్నట్లు స్థానిక వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.
కాగా, శనివారం అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు, ఖమేనీ మద్దతుదారులు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ నాయకులు సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహును హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో (Jamkaran Mosque) ఇరానియన్ల పగ, ప్రతీకారాన్ని సూచించే ఎర్ర జెండా ఎగరడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

