కలం, వెబ్ డెస్క్: డీజీపీ (DGP) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర ఆలయంలో చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆధ్వర్యంలో నాయకులు డీజీపీని కలిసేందుకు వెళ్లారు. అయితే, పోలీసులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు పోలీసుల తీరుకు నిరసనగా అక్కడే ఆందోళన చేపట్టారు. పరిస్థితిని గమనించిన పోలీసులు, చివరికి కవితతోపాటు మరో ఐదుగురు నాయకులకు మాత్రమే డీజీపీని కలిసేందుకు అనుమతి ఇచ్చారు.
డీజేపీతో భేటీ తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. రెండు నెలల చిన్నారి మరణానికి న్యాయం జరిగేలా, సంఘటనకు కారణమైన వారికి శిక్షపడేలా బాధిత కుటుంబం పోరాటం చేస్తోందన్నారు. జాగృతి తరఫున బాధితులకు మద్దతుగా నిలబడతామని కవిత అన్నారు. పాప మరణానికి సంబంధించి పోలీసులు ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదని మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి నేరం చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని కవిత ఆరోపించారు. ఈ కేసులో నిందితులను శిక్షించే వరకు పోరాటం ఆపేది లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

