కలం, తెలంగాణ బ్యూరో : రానున్న పాతికేండ్లలో రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ స్థాయికి తీసుకెళ్ళే లక్ష్యంలో భాగంగా విద్యారంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి (Akunuri Murali) నేతృత్వంలోని తెలంగాణ విద్యా కమిషన్ (Telangana Education Commission) సుదీర్ఘ కసరత్తు చేసి పలు సిఫారసులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి నివేదిక సమర్పించింది. విద్యా రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, చేయాల్సిన సంస్కరణలు, ఉపాధి అవకాశాలు, విద్యారంగం సమూల ప్రక్షాళన, ఫీజుల నియంత్రణ… ఇలాంటి అనేక అంశాలను నివేదికలో ప్రస్తావించినట్లు తెలిసింది. తెలంగాణ రైజింగ్ విజన్ (Telangana Rising Vision) డాక్యుమెంటులో ప్రస్తావించినట్లుగా విద్యారంగం భవిష్యత్ ప్రయాణానికి ఈ నివేదిక కీలకం కానున్నది. ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నది. తెలంగాణ విద్యా విధానం పేరుతో ఈ పాలసీని లాంఛనంగా రిలీజ్ చేసే అవకాశమున్నది. అవసరమైతే కొన్ని ప్రత్యేక చట్టాలను కూడా తీసుకొచ్చే అవకాశాలున్నాయి.
సమీకృత విద్యా విధానానికి శ్రీకారం :
ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర పేర్లతో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళ స్థానంలో సమీకృత (Young India Telangana Integrated Residential School Complex) విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ (CM Breakfast Scheme) పథకాన్ని కొనసాగిస్తున్నది. ఫీజుల నియంత్రణ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రే ఇటీవల ప్రైవేటు విద్యా సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ఫీ రెగ్యులేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తున్నారు. ప్రాథమిక విద్య మొదలు హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ వరకు బోధనతో పాటు సిలబస్లో చేయాల్సిన మార్పులపై ఈ నివేదికలో ఆకునూరి మురళి (Akunuri Murali) నేతృత్వంలోని కమిషన్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ర్యాంకింగ్, గ్రేడింగ్, మార్కుల విషయంలోనూ కొన్ని ప్రతిపాదనలు సూచించినట్లు తెలిసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇలాంటివన్నీ ప్రాథమిక స్థాయి నుంచే కల్పించడంపైనా క్యాబినెట్ భేటీ తర్వాత స్పష్టత రానున్నది.
Read Also : 99 రోజుల యాక్షన్ ప్లాన్.. తెలంగాణ సర్కార్ కీలక జీవో
Follow Us On: X(Twitter)

