కలం, డెస్క్ : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సునీల్ నాయక్ ను (Sunil Nayak) తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ నాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఐజీ సునీల్ నాయక్ మీద రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ నాయుడు విచారణ జరుపుతున్నారు.
ఇప్పటికే సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన ఓ సారి విచారణకు కూడా హాజరయ్యారు. ప్రభుత్వం సునీల్ కుమార్ ను రిటైర్ అయ్యే వరకు సస్పెన్షన్ లోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు సునీల్ నాయక్ (Sunil Nayak) అరెస్ట్ చూస్తుంటే.. ఆయనపై సస్పెన్షన్ వేటు పడేలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీహార్ లో ఐజీగా పనిచేస్తున్నారు సునీల్ నాయక్. వైసీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్ మీద ఏపీ సీఐడీలో ఐజీగా విధులు నిర్వహించారు.
ఇప్పటికే రెండు సార్లు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా సునీల్ నాయక్ హాజరు కాలేదు. దీంతో బీహార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అక్కడి లోకల్ కోర్టులో హాజరు పరిచి ఇవాళ రాత్రికి గుంటూరుకు తీసుకొస్తున్నారు. అయితే సునీల్ నాయక్ ను కూడా సునీల్ కుమార్ లాగే రిటైర్ అయ్యే వరకు సస్పెన్షన్ లోనే ఉంచాలని రఘురామ కోరుతున్నారు. ఈ ఇద్దరినీ జైల్లోనే ఉంచాలనేది రఘురామ డిమాండ్. సునీల్ నాయక్ టార్చర్ చేసినట్టు బలమైన సాక్ష్యాలు చూపిస్తే.. సస్పెన్షన్ వేటు కొనసాగే ఛాన్స్ ఉంది. అదే జరిగితే సునీల్ నాయక్ కు పెద్ద షాక్ తగిలినట్టే అవుతుంది. మరి ఈ కేసులో ఎలాంటి పరిణామం జరుగుతుందో చూడాలి.
Read Also: పాలు కల్తీవా, స్వచ్ఛమైనవా.. ఇంట్లోనే ఇలా చెక్ చేయండి
Follow Us On : WhatsApp


