కలం, డెస్క్ : రాజమండ్రిలో (Rajahmundry Milk Case) కల్తీపాల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. రాజమండ్రిలోని (Rajahmundry Milk Case) చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో కల్తీ పాలు తాగి ఇప్పటికే ఐదుగురు మరణించారు. పదుల కొద్దీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనేక మందికి కిడ్నీల సమస్య వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. డయేరియా, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఈ కేసులో పాల వ్యాపారి గణేశ్ ఇంట్లో ఫోరెన్సిక్ బృందం తనిఖీలు నిర్వహించింది. కల్తీ పాలు, వెనిగర్, ఇతర కెమికల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరిశీలించిన తర్వాత నివేదిక ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం నిందితుడు గణేశ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ కేసుపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కల్తీ పాలు నిజమే అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, కలెక్టర్ ఇప్పటికే రెండు కాలనీల్లో పర్యటించారు. కల్తీ పాలు తీసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. అటు గణేశ్ కు చెందిన ఆవుల రక్త నమూనాలను కూడా సేకరించారు. అలాగే కల్తీపాలు తాగిన వారికి రక్త పరీక్షలు చేస్తున్నారు అధికారులు.


