కలం/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని మర్లపాడు(Marlapadu) గ్రామంలో అక్రమంగా మట్టి తరలింపు యథేచ్ఛగా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు రెండు జేసీబీలు, 20 ట్రాక్టర్లు ఉపయోగించి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. గుట్టలు గుట్టలుగా మట్టి తరలిపోతున్నా కట్టడి చేసే నాథుడే లేకపోవడం బాధాకరమని వాపోతున్నారు.
మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లకు లెసైన్సులు కూడా ఉండటం లేదని, మైనర్లతో ట్రాక్టర్లు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అధికారులు సైతం మట్టి మాఫియాకు కొమ్ము కాస్తున్నట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏ, రెవెన్యూ, పోలీస్ అధికారుల కళ్లు కప్పి మట్టి తరలించే అవకాశమే లేదని స్థానికులు అంటున్నారు. అధికార పార్టీ అండ బలం, కాంట్రాక్టర్ల కండ బలం సామాన్య ప్రజలు, సహజ వనరుల పాలిట శాపంగా మారుతోందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా, యథేచ్ఛగా మట్టి తరలించడం ప్రకృతి వినాశనానికి దారి తీస్తుందని గ్రామస్థులు(Marlapadu) మండిపడుతున్నారు.


